Andhra Pradesh:పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అడుగులు

Polavaram Banakacharla project

Andhra Pradesh:పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అడుగులు:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుల అనుసంధానానికి 81,900 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు తేల్చింది ప్రభుత్వం. అయితే ఈ భారం రాష్ట్ర ఖజానాపై పడకుండా “ఆపరేషన్ మోడల్”లో అనుసంధానాన్ని పూర్తి చేయనుంది. దీనికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్‌ని రెడీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన అన్ని అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అడుగులు

ఒంగోలు, మార్చి 27
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుల అనుసంధానానికి 81,900 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు తేల్చింది ప్రభుత్వం. అయితే ఈ భారం రాష్ట్ర ఖజానాపై పడకుండా “ఆపరేషన్ మోడల్”లో అనుసంధానాన్ని పూర్తి చేయనుంది. దీనికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్‌ని రెడీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన అన్ని అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్‌ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి భారం తగ్గించవచ్చని చెప్పారు. దీనిపై సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుల అనుసంధానానికి సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఈ ఏడాది జూన్ 20 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇదే ఏడాది అక్టోబర్ 20 కల్లా ప్రాజెక్టుకు సీడబ్ల్యుసీ ఆమోదం పొందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. పర్యావరణ అనుమతులు కూడా పొంది, త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పారు. పోలవరం-బనకచర్ల అనుసంధానానికి మొత్తం రూ.81,900 కోట్లు ఖర్చుకానుంది. ఈ అనుసంధానం ద్వారా రోజుకు 2 టీఎంసీలు డిశ్చార్జ్ అవుతుంది. 368.60 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా నీరు తరలిస్తారు. మెయిన్ టన్నెల్ 20.50 కిలోమీటర్లు ఉండగా, సిద్ధాపురం ట్విన్ టన్నెల్స్ 6.60 కిలోమీటర్లు, పైపులైను 17 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. దీని కోసం మొత్తం 9 లిఫ్ట్‌లు వినియోగిస్తారు. 3,377 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు 15,300 ఎకరాల అటవీ భూమితో కలిపి మొత్తం 54,000 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కోసం 5 గ్రామాల్లో 18 నివాస ప్రాంతాల వారికి పునరావాసం కల్పించాల్సి ఉంది. ఈ అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం మొత్తం 3 సెగ్మెంట్లుగా చేపట్టనుంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న పవిత్ర సంగమం వరకు తాడిపూడి వరద కాలువ ద్వారా 175 కిలోమీటర్ల వరకు 18,000 క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో నీటిని తరలిస్తారు. దీనికి 1,401 ఎకరాల భూమి అవసరం అవుతుంది. దీని కోసం రూ.13,800 కోట్లు ఖర్చు కానుంది.

వైకుంఠపురం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు 23,000 క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో నీటిని తీసుకువెళ్తారు. ఇందుకు ఓపెన్ కెనాల్ 83.40 కిలోమీటర్లు, 12.05 కిలోమీటర్లు పైపులైన్, 6 లిఫ్ట్‌లు నిర్మిస్తారు. 2,493 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తారు. 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ సెగ్మంట్‌లోని బొల్లాపల్లి రిజర్వాయర్‌కు 152 టీఎంసీల లైవ్ స్టోరేజ్‌ సామర్థ్యం ఉంటుంది. ఇందుకు రూ.35,750 కోట్ల వ్యయం అవుతుంది.బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు 23,000 క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో నీటిని తరలిస్తారు. ఇందుకు ఓపెన్ కెనాల్ 109.80 కిలోమీటర్లు, పైపులైన్ 5.7 కిలోమీటర్లు, మెయిన్ టన్నెల్, సిద్ధాపురం ట్విన్ టన్నెల్స్ నిర్మిస్తారు. దీనికి రూ.32,350 కోట్ల ఖర్చు అవుతుంది. పోలవరం-బనకచర్ల అనుసంధానం పూర్తైతే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ఇవే. మొత్తం 12.4 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది. కాలువ ప్రవహించే సుమారు 400 కిలోమీటర్లు పొడవునా ఉన్న గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతోపాటు భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాగే 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బొల్లాపల్లి రిజర్వాయర్‌లో మత్స్యసంపద… ఇలా వివిధ మార్గాల్లో ఏడాదికి రూ.12,294 కోట్ల సంపద సృష్టి జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. మరి ఏపీ ప్రభుత్వం వేస్తున్న ఈ అంచనాలు ఏ మేరకు సాకారం అవుతాయో చూడాలి

Read more:Andhra Pradesh:ఐటీ, అడ్వాన్స్డ్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి సిస్కోతో ఒప్పందం

Related posts

Leave a Comment